శాసనసభ గౌరవమర్యాదలకు భంగం కలిగేలా ప్రవర్తించినందుకు 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సభా హక్కుల సంఘం నిర్ణయించింది. సదరు ఎమ్మెల్యేలకు నేడో రేపో నోటీసులు పంపనున్నట్లు సమాచారం.
ఈ నెల 25, 26 తేదీల్లో సభా హక్కుల సంఘం ముందుకు హాజరై వివరణ ఇవ్వాలని వారిని నోటీసులో ఆదేశించనున్నారు.
నోటీసులు అందుకోనున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొడాలి నాని, దాడిశెట్టి రాజా, కొరుముట్ల శ్రీనివాసులు, చిర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, పాశం సునీల్ కుమార్, కిలివేటి సంజీవయ్య, కంబాల జోగులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.
సభలో వైసీపీ ఎమ్మెల్యేలు శ్రుతి మించి ప్రవర్తించారని, అసెంబ్లీ సిబ్బందిపైన, మార్షల్స్పైన దాడి చేయడంతోపాటు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్ల కూడా అమర్యాదకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ జరపాలని స్పీకర్ సభా హక్కుల కమిటీకి నివేదించడంతో, కమిటీ రెండుసార్లు సమావేశమై వీడియో ఫుటేజిని పరిశీలించి, అందులోని దృశ్యాల ఆధారంగా వైసీపీ ఎమ్మెల్యేలను గుర్తించి వారికి నోటీసులివ్వాలని నిర్ణయించింది.
నోటీసు అందుకోబోతున్న ఎమ్మెల్యేలలో పాశం సునీల్ కుమార్ ( గూడూరు ఎమ్మెల్యే ) కొద్దికాలం క్రితం టీ.డీ.పీ. గూటికి చేరడం విశేషం. మరి నోటీసు పట్ల సునీల్ ప్రతిస్పందన ఏమిటో చూడాలి.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి